సీమాంధ్ర ఎంపీల కరపత్రాలపై తెలంగాణ ఎమ్మెల్యేల గుర్రు
ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్ ఎంపీలకు సమైక్యాంధ్ర అనే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే అటు జాతీయస్థాయిలో, ఇటు రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని హెచ్చరించారు. హైదరాబాద్లో ఉన్న వారి వారి వ్యాపారాలను రక్షించుకోవడానికే పార్లమెంటు సభ్యులు సమైక్యాంధ్ర నినాదం వినిపిస్తున్నారన్నారు. తెలంగాణ భూములను ఆక్రమించుకున్నారని, వనరులను దోచుకున్నారని ఆరోపించారు.
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణ జిల్లాల్లో తిరిగి ప్రజల ఆకాంక్షను తెలుసుకోవాలని సవాల్ చేశారు. కాంగ్రెస్కు చెందిన తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఈరోజు పార్లమెంటులో ధైర్యంగా వారి ప్రత్యేక తెలంగాణ నినాదం వినిపించారని అభినందించారు. వారు ఐక్యమత్యంతో వారి బలాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలిపారన్నారు.
తెలంగాణకోసం ఎవరు పోరాడినా మా మద్దతు ఉంటుందని చెప్పారు. అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని వారు కేంద్రాన్ని హెచ్చరించడంతోనైనా కేంద్రం దిగి రావాల్సి ఉందన్నారు. కాగా పార్లమెంటులో కరపత్రాలు పంచడం సీమాంధ్ర ఎంపీల బుద్ధి తక్కువ పని అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. కరపత్రాలతో తెలంగాణను అడ్డుకుంటామని భావిస్తే మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఇక్కడ ఉన్న వారి వ్యాపారాలు రక్షించుకోవడానికే వారు కరపత్రాలు పంచారన్నారు. అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికే వారు ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు.
పాంప్లెట్లు పంచడం పిచ్చి ప్రయత్నం అన్నారు. తెలంగాణకోసం పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే, సిపిఐతో పాటు పలు పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని గుర్తు చేశారు. బిజెపి, టిఆర్ఎస్ తెలంగాణ నినాదాలు అడ్డుకోలేకే లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి వంటి వారు కరపత్రాలు పంచారని ఆరోపించారు.