కాంగ్రెసు ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం: కోదండరామ్
సహాయ నిరాకరణకు సంఘీభావంగా ఈ నెల 25, 26 తేదీల్లో తెలంగాణలోని జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రైల్ రోకో తేదీలను రేపు ఉదయం ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన తెలంగాణ శాసనసభ్యుల వైఖరిని నిలదీస్తూ, వారిని ఎండగడుతూ జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో మీడియా సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ్యుల వైఖరే అవరోధంగా మారిందని ఆయన విమర్శించారు.
శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి నివేదిక రాయాలో అలాంటి నివేదిక రాయలేదని హైకోర్టు న్యాయమూర్తే వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజలు సంతృప్తి చెందుతారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్దత లేదని అటార్నీ జనరలే స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీన మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు.