పులివెందుల నుంచి వైయస్ వివేకానే పోటీ, అయినా ఎమ్మెల్సీగా ఎన్నిక
మంత్రిగా ఉన్న వైయస్ వివేకానంద రెడ్డిని త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కోటా నంచి మండలికి తిరిగి పంపాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేల కోటా నుంచి అభ్యర్థిగా నిర్ణయించడం వల్ల వివేకానంద రెడ్డి విజయానికి ఢోకా ఉండదని కాంగ్రెసు అధిష్టానం భావించినట్లు సమాచారం. అదే సమయంలో ఆ తర్వాత జరిగే పులివెందుల ఉప ఎన్నిక కాంగ్రెసు అభ్యర్థి కూడా వివేకానంద రెడ్డే అవుతారు. పులివెందుల నుంచి గెలిచే అవకాశాలపై అనుమానాలతో ముందు జాగ్రత్త చర్యగా ఆయనను మండలికి ఎన్నిక చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పులివెందుల నుంచి వివేకానంద రెడ్డి ఓడిపోయినా ఎమ్మెల్సీగా మంత్రి పదవిలో కొనసాగడానికి ఏ విధమైన ఆంటకాలు ఉండవు. ఆరు నెలల పాటు శాసనసభకు గానీ మండలికి గానీ ప్రాతినిధ్యం వహించకపోయినా మంత్రిగా కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ విధమైన ఇబ్బందిని ముందే నివారించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దింపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.