వైయస్ జగన్ సాక్షి పెట్టుడులపై విరుచుకుపడిన ఆంధ్రజ్యోతి
ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.మహీధర్ 2010 డిసెంబరు 31న జగతి పబ్లికేషన్స్కు జారీ చేసిన నోటీసుల ప్రతిని తాము సంపాదించామని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసుకుంది. సాక్షి పెట్టుబడులు ఏయే వ్యక్తుల నుంచి, కంపెనీల నుంచి వచ్చాయి, ఆ కంపెనీల చిరునామాలేమిటి, వాటి ఆర్థిక పరిస్థితి ఏమిటి, అవి సాక్షిలో ఎందుకు భారీ ప్రీమియంకు పెట్టుబడి పెట్టాయి వంటి అంశాలన్నింటినీ ఐటీ శాఖ కూలంకషంగా విచారించిందని చెప్పింది. 60 పేజీల ఈ నోటీసును పరిశీలిస్తే ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయని, ఈ నోటీసుల ప్రకారం చూస్తే రూ.374 కోట్ల మూలధనం (ప్రీమియం సహా) కలిగిన 'జగతి పబ్లికేషన్స్'లో పెట్టుబడులు రెండు రకాలని, ఒకటి ప్రమోటర్లు (జగన్ తదితరులు) పెట్టిన సొమ్ము కాగా, రెండోది ఇతర కంపెనీలు పెట్టిన సొమ్ము అని, అయితే ఇందులో చాలా విచిత్రం జరిగింది. ప్రమోటర్లు కేవలం 20 శాతం సొమ్ము పెట్టుబడిగా పెట్టారని వివరించింది.
కానీ, కంపెనీలో 90 శాతం వాటా వారిదేని, ఇతర కంపెనీలు, వ్యక్తులు 80 శాతం సొమ్ము పెట్టగా వారికి దక్కిన వాటా కేవలం పది శాతమేనని, పది రూపాయల విలువ చేసే షేరుకు ఆ కంపెనీలు, వ్యక్తులు రూ.350 ప్రీమియం చెల్లించారని, ఇంకా వ్యాపారం కూడా ప్రారంభించని ఒక కంపెనీ షేర్ను అంత భారీ ప్రీమియంకు కొనాలంటే ఆ కంపెనీ ప్రమోటర్లు అప్పటికే గొప్ప వ్యాపారవేత్తలుగా ప్రఖ్యాతులై ఉండాలని, ఆ కంపెనీ భారీ లాభాలు ఆర్జించబోయే రంగంలోనిదై ఉండాలని, కానీ అటువంటిదేమీ లేకుండానే ఈ కంపెనీలు సాక్షిలో భారీ ప్రీమియంకు పెట్టుబడి పెట్టాయని, అరబిందో, మ్యాట్రిక్స్, పీవీపీ వెంచర్స్, హెటెరో డ్రగ్స్, పెన్నా సిమెంట్స్ వంటి కంపెనీలు ఇలా భారీ మొత్తాల్ని సాక్షికి నజరానాగా సమర్పించుకున్నాయని ఆంధ్రజ్యోతి డైలీ వ్యాఖ్యానించింది. మొత్తం విషయాలను ఆంధ్రజ్యోతి దినపత్రిక సవివరంగా విశ్లేషించింది.