కాకరపల్లి కాల్పులపై రభస, అసెంబ్లీ పది నిమిషాల పాటు వాయిదా
శ్రీకాకుళం జిల్లా కాకర్లపల్లిలో ప్రభుత్వం బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. కాల్పులు జరిపిన ప్రదేశానికి పోలీసులు యుద్దానికి వెళ్లారా ? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో నష్టపోయినవారికి న్యాయంచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ ఘటనపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పది గంటలకు ప్రకటన చేస్తారని, అందువల్ల సభ సాగేలా చూడాలని ఆయన చెప్పారు. అయినా ప్రతిపక్షాలు వినలేదు. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా హోం మంత్రి ప్రకటన చేస్తారని చెప్పారు. సభను సాగనివ్వాలని ఆయన కోరారు. ప్రతిపక్షాల సభ్యులు ఎంతకీ వినకపోవడంతో నాదెండ్ల మనోహన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
ప్రభుత్వ తీరుపై బిజెపి పక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల శవాలపై ప్రాజెక్టులు కడుతారా అని ఆయన సభ వాయిదా పడిన తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. ప్రజల సమాధులపై ప్రాజెక్టులు నిర్మిస్తామంటే అది ప్రజాస్వామ్యం కాదని ఆయన అన్నారు. కాగా, రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు మంగళవారం సభకు హాజరు కాలేదు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత సభ్యులు కూడా రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు సభ్యులు సమావేశాలను బహిష్కరించారు. దీంతో సోమవారం వరకు తెలంగాణపై స్తంభించిన సభా కార్యక్రమాలు మంగళవారం శ్రీకాకుళం జిల్లా కాల్పుల ఘటనపై స్తంభించాయి.