గంగా భవానీకి చాన్స్, కాంగ్రెసు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఖరారు
తూర్పు గోదావరి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజుకు మరోమారు పార్టీ అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రితో బాటు పలువురు మంత్రులు కూడా గిడుగుకు టికెట్లో బాసటగా నిలిచారు. పశ్చిమగోదావరి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ గంగాభవానికే టిక్కెట్ దక్కింది. ఇక్కడ ఆమెకు పెద్దగా పోటీ ఎదురు కాలేదు. నెల్లూరులో వాకాటి నారాయణరెడ్డి పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గట్టిపోటీ ఇచ్చినా సీనియర్ నేత నేదురుమల్లి జనార్దన్రెడ్డి మాటే నెగ్గింది. రాఘవేంద్రరెడ్డి అభ్యర్థిత్వం కోసం ఆనం సోదరులు తీవ్రంగా ప్రయత్నించినా నారాయణరెడ్డి టికెట్ రేసులో ముందు నిలిచారు. చిత్తూరు జిల్లాలో సీఎంకు అత్యంత సన్నిహితుడు, మదనపల్లికి చెందిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ నరేష్కుమార్రెడ్డికిఅవకాశం దక్కింది.
కడప జిల్లాలో అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి పేరు ఇప్పటికే ఖరారయినా మళ్లీ పెండింగులో పడిందని చెబుతున్నారు. అనంతపురంలో పాటిల్ వేణుగోపాల్రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. ఆయన సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లాలో సీఎంకు అత్యంత ఆప్తుడైన మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి తనయుడు ఎస్వీ మోహనరెడ్డికి పార్టీ అభ్యర్థిత్వం దక్కింది. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతోనే ఎస్వీ మోహన్రెడ్డికి అవకాశం లభించింది. 2009 శాసనసభ ఎన్నికల్లో పత్తికొండ నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థానం కోసం పార్టీ నాయకుడు గంగుల ప్రభాకరరెడ్డి ఢిల్లీలో మకాం వేసి పెద్దఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి కూడా టికెట్ కోసం యత్నించారు.