ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణ హత్య, భర్తే నరికి చంపాడని ఆరోపణ
పెద్దకుమార్తె కృష్ణవేణి దువ్వాడలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 10వ తరగతి వరకే చదివి, డ్రైవర్గా చిన్న ఉద్యోగం చేస్తున్న రవికుమార్తో గత ఏడాది ఆగస్టు 29న కృష్ణవేణి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.1.20 లక్షల కట్నం కూడా ఇచ్చారు. రవికుమార్ ఆమెను కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఇంటికి తిరిగి వస్తున్న కృష్ణవేణిని పిఠాపురం కాలనీ కళాభారతి వద్ద అటకాయించాడు. కొద్దిసేపు ఇద్దరికీ రోడ్డుపైనే వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రవికుమార్ పక్కనే ఉన్న కొబ్బరి బోండాల దుకాణంలో ఉన్న కత్తిని తీసుకుని ఆమె మెడపై వేటువేశాడు. దీంతో కృష్ణవేణి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రవికుమార్ పారిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కృష్ణవేణిని కేజీహెచ్కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సీపీ ఆదేశాల మేరకు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.