దిగొచ్చిన కరుణానిధి: కాంగ్రెస్తో డిఎంకె పొత్తు ఖరారు
అయితే ఇరు వర్గాలు ఒక్కో మెట్టు దిగినట్టు కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 63 స్థానాలతో పాటు కాంగ్రెస్ అధికారంలో భాగస్వామ్యం అడిగిందని, అయితే కరుణానిధి కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటానని ప్రకటించడంతో కేంద్రం మొదట దిగి వచ్చి అధికార భాగస్వామ్యం అంశాన్ని పక్కన పెట్టిందని, ఆ తర్వాత డిఎంకె 63 స్థానాల వద్ద వెనక్కి తగ్గిందని తెలుస్తోంది. కాగా ప్రధానికి రాజీనామాలు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన డీఎంకే మంత్రులు అక్కడ కాంగ్రెస్ నేతలు సముదాయించడంతో చల్లబడ్డారు. సోమవారం రాత్రి సోనియాతో చర్చలు విఫలమైన తర్వాత మంగళవారం ఉదయం కేంద్రమంత్రులు దయానిధి మారన్, అళగిరి కాంగ్రెస్ నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఆంటోనీ, ఆజాద్లతో మళ్లీ చర్చించారు. ఆ చర్చలలో ఎట్టకేలకు డిఎంకె కాంగ్రెస్ పార్టీ అడిగిన 63 సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లుగా గులాం నబీ ఆజాద్ ఆ తర్వాత ప్రకటించారు.
కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాలన్నీ యథాతథంగా ఇవ్వడానికి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మిగిలిన స్థానాలపైనే చర్చలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వంలో స్థానం విషయాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయిస్తారు. ఢిల్లీలో పొత్తపై కాంగ్రెస్ పెద్దలు ప్రకటన తర్వాత చెన్నైలో కరుణానిధి మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ ఇది చాలా సంతోషకరమైన రోజని వ్యాఖ్యానించారు. ఇకనుంచి కూటమిలో సమస్యలుంటే తామే చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు. కూటమి పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు డీఎంకే 121, పీఎంకే 30, వీసీకే 10, కేఎంకే 7, ఐయూఎంఎల్ 2, ఎంఎంకే 1 స్థానాల్లో పోటీ చేస్తాయని కరుణ వివరించారు.