టిడిపి సీమాంధ్ర శాసనసభ్యులకు నాగం జనార్దన్ రెడ్డి కౌంటర్
మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్బండ్పై జరిగిన విధ్వంసాన్ని అసెంబ్లీలో చర్చించాలంటూ సీమాంధ్ర టీడీపీ ఎమ్యెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేయడాన్ని టీడీపీ ఎమ్యెల్యే నాగం జనార్ధన్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో టీడీపీకి ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నాగంను బుజ్జగించేందుకు టీడీపీ ఎమ్యెల్యేలు తంటాలు పడుతున్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా లక్షమందిని అరెస్ట్ చేసిన విషయంపై చర్చించకుండా విగ్రహాల విధ్వంసంపై చర్చించడం సరికాదని నాగం అభిప్రాయపడ్డారు.
కాగా, తెలంగాణ అంశంపై బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేశారు. సీమాంధ్ర శాసనసభ్యులకు నాగం జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో వారు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.