చిన్న నిర్మాతల పోరు: దాసరి నారాయణ రావు వర్సెస్ అల్లు అరవింద్?
స్వలాభం కోసం మాత్రమే పని చేస్తూ సినీ రంగాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్న ఐదుగురు పెద్ద నిర్మాతలను ఎదుర్కోవడానికి దాసరి నారాయణ రావు ముందుకు రావాలని నట్టి కుమార్ అన్నారు. అలా రావడం దాసరి నారాయణ రావు బాధ్యత అని ఆయన అన్నారు. తెలుగు సినీ రంగాన్ని కాపాడడానికి దాసరి ముందుకు వస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి సినిమా, మేనల్లుడి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి టికెట్ రేట్లు పెంచాలని కోరుతున్నారని, ఒకటి రెండు వారాల్లో పెట్టిన డబ్బులకు మించి ప్రజల నుంచి దండుకోవడానికి టికెట్ రేట్లు పెంచాలని అడుగుతున్నారని ఆయన అన్నారు.
ఖలేజా, ఆరెంజ్ వంటి సినిమాలకు భారీ పెట్టుబడులు ఎవరు పెట్టమన్నారని ఆయన అడిగారు. ఓ నిర్మాత ఓ హీరోయిన్కు రెండు కోట్ల 25 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని, హీరోకు పది కోట్ల నుంచి 18 కోట్ల రూపాయల వరకు ఇస్తున్నారని, ఆ రకంగా నిర్మాణ వ్యయం పెంచుకుంటున్నారని, ఒక్కో సినిమాను రెండేళ్ల పాటు తీస్తూ కూడా బడ్జెట్ పెంచుకుంటున్నారని, దీన్నంతా ప్రజల నుంచి రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచితే తగ్గించాలని ఆందోళన చేస్తున్న వ్యక్తి సినిమా టికెట్ల రేట్లు పెంచాలని అడుగుతున్నాడని నట్టి కుమార్ చిరంజీవిపై పరోక్ష విమర్శ చేశారు.