చంద్రబాబు చాతుర్యానికి సిపిఐ, టిడిపి ఎమ్మెల్యేలు దెబ్బ
టిడిపి మిత్ర పక్షానికి మొత్తం 93 ఓట్లు ఉండగా, ముగ్గురు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అయితే నాలుగో అభ్యర్థి గెలిచే అవకాశాలు లేకున్నప్పటికీ టిడిపి ప్రతిభా పాటిల్ను రంగంలోకి దించారు. అందులోనే చంద్రబాబు చాణక్యం ప్రదర్శించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావించిన బాబు ప్రతిభను దింపారు. అయితే మొదట మొదటి ఇద్దరు అభ్యర్థులకు 25 చొప్పున, మూడో అభ్యర్థికి 24 చొప్పున ఎమ్మెల్యేలను కేటాయించి 19 మందిని ప్రతిభకు కేటాయించారు. అయితే ఎన్నికలు ప్రారంభం అయ్యాక జగన్ వర్గం వ్యూహం తెలియడంతో బాబు ప్రతివ్యూహం చేశారు.
మొదటి ముగ్గురు అభ్యర్థులకు 24, ప్రతిభకు 21 మంది ఎమ్మెల్యేలను కేటాయించినప్పటికీ మరో వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఇద్దరు అభ్యర్థులకు 24 ఓట్లు, మూడో అభ్యర్థికి 23, ప్రతిభకు 22 ఓట్లు వేయించాలని అలా అయితే నలుగురిని గెలిపించుకోవచ్చునని బాబు వ్యూహరచన చేశారు. అయితే ఒక అభ్యర్థికి ఓటు తగ్గించుకవడానికి సిపిఐ నిరాకరించడంతో పాటు, టిడిపి ఎమ్మెల్యేలు అసలుకే మోసం వస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేసి ససేమీరా అన్నారు. బాబు చేసేది లేక ఊరుకున్నారు. కానీ ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పుడు అందరూ చంద్రబాబు వ్యూహాన్ని అనుసరిస్తే నలుగురిని గెలిపించుకునే వాళ్లం కదాని ఆని బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.