తెరాసలో ముసలం: కెసిఆర్ చేతికి ఎమ్మెల్యే రాజీనామా లేఖ
తన రాజీనామా లేఖను విద్యాసాగర రావు పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు సమర్పించారు. తనపై ఆరోపణలు రావడం దురదృష్ణకరమని, తాను క్రాస్ వోటింగుకు పాల్పడలేదని విద్యాసాగర రావు అంటున్నారు. క్రాస్ వోటింగుకు పాల్పడినట్లు రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో క్రాస్ వోటింగు ఆరోపణలు పార్టీని తీవ్రంగా కలచివేస్తున్నాయి.
తాను నేరం చేసినప్పుడు రుజువైతే తన రాజీనామాను ఆమోదింపజేయాలని విద్యాసాగర రావు కెసిఆర్ను కోరారు. కెసిఆర్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. క్రాస్ వోటింగ్ ఆరోపణలపై తెరాస పోలిట్బ్యూరో శనివారం సాయంత్రం సమావేశమైంది. కెసిఆర్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన నివాసంలోనే సమావేశం ఏర్పాటైంది. మరో శాసనసభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా తన రాజీనామా లేఖతో సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది.