ఎదురుతిరిగిన వైయస్ జగన్ వ్యూహం, తప్పని ధిక్కారం?
అది ఒక కోణమైతే, మరో కోణంలో కూడా వైయస్ జగన్ వ్యూహం ఎదురు తిరిగింది. కాంగ్రెసు అభ్యర్థిని ఓడించాలనే వైయస్ జగన్ వ్యూహాన్ని ఆయన వర్గానికి చెందిన శాసనసభ్యులే దెబ్బ తీశారు. వ్యూహరచన సమావేశానికి హాజరైన 27 మంది శాసనసభ్యుల్లో కేవలం పది మంది మాత్రమే జగన్ మాట విన్నట్లు కనిపిస్తున్నారు. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులంతా ఆయన వ్యూహాన్ని అమలు చేసి ఉంటే కచ్చితంగా జానీ ఓడిపోయేవారనే అంటున్నారు. జగన్ వర్గం శాసనసభ్యుల వ్యూహాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జానీని గెలిపించుకునేందుకు తగిన సమయం కూడా చిక్కింది. వారు మజ్లీస్ అభ్యర్థి రిజ్వీకి ఓటేయబోతున్నట్లు తెలుసుకున్న ముఖ్యమంత్రి రిజ్వీకి కేటాయించిన కొన్ని ఓట్లను జానీకి బదిలీ చేశారు. దీంతో జానీ బయటపడ్డారు.
తమ శాససనభ్యులను ఓటు వేయడానికి ఉదయం పూటే పంపడం వల్ల కూడా సర్దుబాటు చేసుకుని, ప్రతివ్యూహం రూపొందించుకోవడానికి ముఖ్యమంత్రికి వెసులుబాటు కలిగిందని, దాంతో ముఖ్యమంత్రి జాగ్రత్త పడి జానీ ఓడిపోకుండా చూసుకున్నారని అంటున్నారు. సాయంత్రం వరకు వెళ్లకుండా ఉంటే ముఖ్యమంత్రిలో టెన్షన్ పెరిగేదని, ఆ టెన్షన్లో ఆయనకు వెసులుబాటు దొరికేది కాదని చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహం బెడిసి కొట్టడం వెనక అనుభవ రాహిత్యం ఉందని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులే అంగీకరిస్తున్నారు. శాసనసభ్యులంతా జగన్ మాట వినకపోవడం కూడా పెద్ద లోపంగా కనిపిస్తోంది. శాసనసభ్యులను ఒక తాటి మీద నిలబెట్టడంలో జగన్ విఫలమయ్యారని అంటున్నారు. ఈ వైఫల్యాన్ని జగన్ వర్గానికి చెందిన నాయకుడు జూపూడి ప్రభాకర రావు స్వయంగా అంగీకరించారు. భవిష్యత్తులో ఇటువంటి లోపాలు జరగకుండా ఈ సంఘటన ఉపయోగపడుతుందని చెబుతున్నారు.