'అతిధిదేవో భవ' కి ప్లాట్ అయిపోయిన అపర కుబేరుడు
భారత్, చైనా తదితర దేశాలు వృద్ధిపథంలో దూసుకెళ్లడం అమెరికాకు కూడా ప్రయోజనకరమేనని వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం బఫెట్ విలేకరులతో మాట్లాడారు. 'భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఇక్కడ తప్పకుండా కొంత మొత్తాన్ని వెచ్చించవచ్చని భావిస్తున్నా"నని ఆయన పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడులకు సంబంధించి భారీ ప్రణాళికలే ఉన్నాయని, అయితే బీమా వంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులపై పరిమితులు అడ్డంకిగా పరిణమిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ను తాను కలుస్తానని చెప్పిన బఫెట్... ఆ సమావేశం ఎజెండాను మాత్రం వెల్లడించలేదు. దాతృత్వ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం భారత్కు వచ్చిన బఫెట్ పెట్టుబడి అవకాశాలు, ఇతరత్రా అంశాలపైనా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది.
బెర్క్షైర్ హాథ్వే సంస్థకు అధిపతి అయిన బఫెట్ ఇన్వెస్ట్మెంట్స్ అమెరికాలోనే అధికం. అయితే చైనా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా తదితర దేశాల్లోనూ గతంలో ఆయన పెట్టుబడులు పెట్టారు. తాజాగా భారత్లోని బజాజ్ అలియెంజ్ బీమా కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు బఫెట్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా దేశ బీమా రంగంలోకి ఆయన కంపెనీ ప్రవేశించినట్లయింది. ఏడాదికొక భారీ పెట్టుబడి ఐడియాతో తాను సంతోషంగా ఉంటానని, అయితే, అది భారత్ నుంచా అమెరికా లేదా ఇతర దేశాల నుంచా అనేదానితో సంబంధం లేదన్నారు. భారత్లో ప్రణాళికల గురించి ఇతర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్డీఏ) చైర్మన్ జె.హరినారాయణతో శుక్రవారం సమావేశం కానున్నట్లు బఫెట్ చెప్పారు. బజాజ్ అలియెంజ్కు దేశంలో కార్పొరేట్ ఏజెంట్గా వ్యవహరించేందుకు బఫెట్ గ్రూప్ బెర్క్షైర్ హాథ్వే తాజాగా ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో బఫెట్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో ప్రవేశం కోసం బెర్క్షైర్ హాథ్వే ఇండియా సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
బెర్క్షైర్ హాథ్వేకి బఫెట్ తర్వాత భారతీయ సంతతికి చెందిన అజిత్ జైన్ నేతృత్వం వహించనున్నారంటూ చాలాకాలంగా వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా బఫెట్ ఆయనను పొగడ్తల్లో ముంచెత్తారు. బెర్క్షైర్ డెరైక్టర్ల బోర్డు తదుపరి చీఫ్గా జైన్ వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయని బఫెట్ అన్నారు. 'అజిత్ జైన్ను నా దగ్గరకు చేర్చినందుకు భారత ప్రజలకు నేను రుణపడిఉన్నా. నా కంటే ఆయన ఎంతో ప్రతిభావంతుడు" అని బఫెట్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అజిత్ జైన్ బెర్క్షైర్ హాథ్వే రీఇన్సూరెన్స్ వ్యాపారానికి హెడ్గా వ్యవహరిస్తున్నారు.
బఫెట్ రిటైర్ అయితే, ఆయన స్థానంలో జైన్కే అవకాశాలు ఉన్నాయని ఎప్పటినుంచో వినవస్తోంది. బఫెట్ కూడా తన వారసుడిగా గ్రూప్లోని వ్యక్తివైపే మొగ్గుచూపుతానని చెబుతూ వస్తున్నారు. భారత పర్యటలో ఉన్న బఫెట్ను ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా... సూటిగా సమాధానమివ్వలేదు. 'నా విధులను చేపట్టేందుకు జైన్ దృష్టిపెట్టడం లేదు. అయితే ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి" అన్నారు. 1985లో తొలిసారి జైన్ను కలిశానని, ఒక అత్యద్భుతమైన నిపుణుడిని తీసుకుంటున్నానని అప్పుడే గ్రహించానంటూ గత స్మృతులను బఫెట్ గుర్తు చేసుకున్నారు.
1991లో మైక్రోసాఫ్ట్కు చెందిన 100 షేర్లను కొనుగోలు చేసిన సంగతిని ప్రస్తావిస్తూ... ఐటీ వ్యాపారం గురించి తనకు పెద్దగా తెలీదని, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించబోనని బఫెట్ అన్నారు. ఐటీ కంటే సాఫ్ట్ డ్రింక్స్, చూయింగ్ గమ్స్ వ్యాపారాలకు సంబంధించిన కంపెనీలనే తాను బాగా అర్థం చేసుకోగలిగానని చెప్పడం గమనార్హం.