కిరణ్ మంత్రివర్గంలో ఎమ్మెల్సీ చిచ్చు: రాజీనామాకు సిద్ధపడిన వట్టి
స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గిడుగు రుద్రరాజు, గంగా భావనీ అభ్యర్థిత్వాలను స్థానిక శాసనసభ్యులు వ్యతిరేకించినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే, చిత్తూరు జిల్లాలో ఓటమిపై కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీద విమర్శలు వస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ జిల్లాకే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కాంగ్రెసు అభ్యర్థి ఓడిపోవడం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
మూడు సీట్లను వైయస్ జగన్ వర్గం అభ్యర్థులు గెలుచుకోవడం కూడా కాంగ్రెసు పార్టీలో చిచ్చుకు కారణం కావచ్చునని భావిస్తున్నారు. కడపలో ముగ్గురు మంత్రులు మోహరించి కూడా జగన్ వర్గం అభ్యర్థిని నిలువరించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.