పేదల కోసం సంపదలో కొంత మొత్తాం వెచ్చించండి: బఫెట్-గేట్స్
చారిటీ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో బిల్గేట్స్, బఫెట్లు మాట్లాడారు. భారతీయ సంప్రదాయంలోనే దాతృత్వం అంతర్భాగమని గేట్స్ కొనియాడారు. ఈ దిశగా ఉత్సాహం చూపుతున్న కొన్ని కుటుంబాలను ఇక్కడ కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. భారత్లో కూడా ప్రస్తుతం సామాజిక సేవ చేయాలన్న ధోరణి పెరుగుతోందన్నారు. వంశపారంపర్యంగా సంపన్నులైన వారికంటే సొంతంగా బిలియనీర్లుగా ఎదిగిన వారే ఇక్కడ దాతృత్వానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హుండీలతో, జాబితాలతో తాము తిరగడం లేదని, ప్రతీదీ వారి అభిష్టానుసారమే జరుగుతుందని బిల్గేట్స్ స్పష్టంచేశారు.
మరిన్ని విరాళాలు రావాలని, విరాళాలివ్వాల్సిందిగా ఎవరిపైనా తాము ఒత్తిడి తీసుకురామని వాళ్లకి వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు గేట్స్ చెప్పారు. విరాళాల ముసుగులో బ్లాక్మనీ వచ్చే అవకాశాలున్నాయన్న ప్రశ్నకు, దానికి తాము జవాబుదారీ కాదని గేట్స్ స్పష్టం చేశారు. ఇలాంటివి ఏమైనా జరిగితే పోలీసులు చూసుకుంటారని చెప్పారు. ఒక బిడ్డ వ్యాక్సిన్ కారణంగా బతికి బట్టకడితే, ఆ డబ్బు లేదా వ్యాక్సిన్ ఎక్కడ నుంచి వచ్చిందో ఆరాతీయదని బఫెట్ వివరించారు.
భారత్లో దాతృత్వం, సామాజిక సేవలో పాలుపంచుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని బఫెట్ అన్నారు. దీనిపట్ల ఆసక్తి ఉన్నవారు చాలా మందే ఉన్నట్లు స్వయంగా తాను గమనించానని చెప్పారు. భారత్లో దాతృత్వ కార్యకలాపాలను తెలుసుకోవడం, అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ ఫోరమ్ వీలుకల్పించిందని, ఇటువంటి అవకాశం కోసమే ఎంతో కాలంగా ఎదురుచూశానని బఫెట్ పేర్కొన్నారు.
ఒకపక్క దాతృత్వ సమావేశంలో బఫెట్-గేట్స్ భారత కార్పొరేట్లతో బిజీబిజీగా గడపగా... భారత్లో టాప్ బిలియనీర్ , రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రం కార్యక్రమానికి హాజరుకాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అహ్మదాబాద్లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ మ్యాచ్లో ముకేశ్ దంపతులు కేరింతలు కొట్టడం విశేషం. మరోపక్క హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కూడా క్రికెట్ మ్యాచ్కే ప్రాధాన్యమిచ్చారు.