అలుపెరుగని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ధర్మబిక్షం మృతి
నల్గొండ జిల్లా మునుగోడు మండలం వూకొండి గ్రామంలో గీతకార్మికుల ఇంట 15 ఫిబ్రవరి 1922న ధర్మభిక్షం జన్మించారు. వారి కుటుంబం సూర్యాపేటలో స్థిరపడింది. ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను వ్యతిరేకించి తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టుపార్టీ పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పని చేస్తూనే పాత్రికేయునిగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్, రయ్యత్, గోల్కొండల్లో పని చేశారు.
నిజాంపై సాయుధపోరాటం మొదలైన తర్వాత తుపాకి చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధపోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో అరెస్త్టె ఐదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు. హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమైన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికై భారీ మెజార్టీతో గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం 1957, 1962లలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1991, 96లలో నల్గొండ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్ర పురస్కారం అందుకున్నారు.