వైయస్ జగన్ సాక్షిలో అవాస్తవాలు: కాంగ్రెసు కథనంపై తులసి రెడ్డి
కాంగ్రెసు పార్టీ జాతీయ పార్టీ అయినందున అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం కావడం మామూలే అన్నారు. అభ్యర్థుల లిస్టును అధిష్టానానికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆలస్యం అవుతుందన్నారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపించామని, అధిష్టానం ఆమోదం తెలిపిన తర్వాత పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై తులసీరెడ్డి ఫైర్ అయ్యారు. ఆ పత్రికలో కాంగ్రెసు పార్టీకి అభ్యర్థుల కొరత ఉందని, కడపలో పోటీ చేయడానికి కాంగ్రెసుకు అభ్యర్థులు కావాలంటూ పేర్కొన్నారని ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు.
సింహం జూలు విదిల్చిన చందంగా కాంగ్రెసు పార్టీలో కడప నుండి పోటీ చేయడానికి చాలా మంది ఉన్నారన్నారు. అయితే ఎవరిని పోటీ చేయించాలో నిర్ణయించుకోవడానికి అధిష్టానం అనుమతి అవసరం ఉంటుందని చెప్పారు. మాకు అభ్యర్థుల కొరత లేదన్నారు. ఆ పత్రికలో వచ్చిన ఆల్ ఫ్రీపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెసు పార్టీ త్యాగధనుల పార్టీ అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాన మంత్రి పదవిని వదులుకున్న త్యాగధనురాలు అన్నారు. అలాంటి పార్టీలో ఎవరో వరాలు అడిగినట్టు, ఇవ్వాలన్నట్లు చెప్పడం అవాస్తవమన్నారు.
కందుల సోదరులు కాంగ్రెసు పార్టీలో చేరడాన్ని చంద్రబాబు ప్రశ్నించడాన్ని ఆయన తప్పు పట్టారు. టిడిపి నుండి తీసుకు వెళ్లి అభ్యర్థులను నిలబెడుతున్నారని చంద్రబాబు అంటున్నారని అయితే మైసూరారెడ్డి కాంగ్రెసు నుండి టిడిపిలోకి వెళ్లలేదా అని ప్రశ్నించారు. కందుల సోదరులు కొద్దికాలం టిడిపిలో ఉన్నప్పటికీ వారి కుటుంబానికి కాంగ్రెసుకు అనుబంధం ఉన్నదన్నారు. 1977-80 మధ్య కందుల సోదరుల తండ్రి ఓబుల్ రెడ్డి కాంగ్రెసు ఎంపీగా ఉన్నారన్నారు. శివానందరెడ్డి కూడా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా కాంగ్రెసులో పని చేశారని అన్నారు.