సన్నిహితుల మాటతో జగన్పై పోటీకి కందుల వెనక్కి తగ్గుతారా?
బద్వేలు, జమ్మలమడుగు ప్రాంతాల్లో కాంగ్రెసుకు ఏమాత్రం పట్టులేదని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకుండా ఉండటమే బెటర్ అని వారు కందులను హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో గట్టి పోటీ అనుకున్న దివంగత వైయస్ పైనే లోకసభ స్థానానికి పోటీ చేసి ఆయనను ఓటమి అంచులోకి తీసుకు వెళ్లారని అయితే జగన్పై పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశ్యంతో కందుల రాజమోహన్ రెడ్డి సోదరుడు కందుల శివానందరెడ్డి పోటీకే సై అంటున్నట్టుగా తెలుస్తోంది.
వైయస్ కుటుంబంతో ఢీకొట్టి గెలిచే అవకాశాలున్నాయని శివానంద అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో తమకు మంచి పట్టు ఉందని, కాంగ్రెసు టిక్కెట్ ఇస్తే కాంగ్రెసు ఓటింగు జత కలిసి గెలవడం ఖాయమని శివానందరెడ్డి అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పోటీ చేయడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. అయితే వీరు తమ సన్నిహితులతో భేటీ అయి నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోటీ చేస్తామని ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనక్కి తగ్గితే బావుండదని, అయినా గెలుపు ఖాయంగా కనిపిస్తున్నందున తప్పుకోవడంలో అర్థం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.