హసన్ అలీతో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్కు, వైయస్ జగన్కు లింక్స్?
హసన్ అలీకి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రితో సంబంధాలున్నట్లు ఇప్పటికే చెప్పాం. ఇప్పుడు ఇదే రాష్ట్రానికి చెందిన మరో మాజీ ముఖ్యమంత్రితోనూ అలీకి లింకులున్నట్లు బయటపడింది అని మెయిల్ టుడే మరో బాంబు పేల్చింది. హసన్ అలీ సుదీర్ఘకాలం సదరు ముఖ్యమంత్రితో హవాలా కార్యకలాపాలు నడిపినట్టు మెయిల్ టుడే చెప్పింది. ఆయన మరణం తర్వాత ఆయన తనయుడూ దానిని కొనసాగించాడని వివరించింది. హసన్ అలీతో సంబంధాలు నడిపింది వైయస్సేనని, ఆయన మరణం తర్వాత జగన్ కూడా ఇదే దారిలో ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ వివిధ మార్గాల ద్వారా తన కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను గుప్పించినట్లు ఇప్పటికే బయటపడింది.
వేల కోట్ల సంపదను రకరకాల మార్గాల ద్వారా మళ్లించి, మళ్లీ ఆయన కంపెనీల్లోకే బదిలీ చేసేందుకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిధులు సమకూర్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నది హసన్ అలీయే అని
దీని ద్వారా ఇప్పుడు స్పష్టమైనట్టు పలువురు భావిస్తున్నారు. హసన్ అలీ మారిషస్, సింగపూర్ల ద్వారా భారీ స్థాయిలో హవాలా కార్యకలాపాలు నిర్వహించాడు. జగన్ కంపెనీల్లోకి కూడా మారిషస్కు చెందిన కొన్ని మాయ కంపెనీల నిధులు ప్రవహించిన సంగతి తెలిసిందే. మారిషస్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుతో హసన్ అలీకి ప్రత్యక్ష సంబంధాలున్నాయని తెలిసింది. ఈ ఆర్థిక సలహాదారు మద్దతుతోనే మారిషస్ నుంచి భారత దేశంలో ఉన్న జగన్ వంటి మిత్రుల కంపెనీలకు పెద్ద ఎత్తున నల్లధనాన్ని మళ్లించాడు.
తర్వాత కొన్నాళ్లకు ఈ మారిషస్ అధికారి హవా తగ్గిపోయింది. దీంతో హసన్ అలీ తన కార్యకలాపాలను సింగపూర్కు మార్చాడు. హసన్ అలీతోపాటు ఆయన ప్రధాన సహచరుడు, కోల్కతాకు చెందిన పారిశ్రామికవేత్త కాశీనాథ్ తపూరియా కూడా ఈడీ ముందు సదరు యువనేత పేరు బయటపెట్టినట్లు తెలిసింది. ఈడీ వర్గాల కథనం ప్రకారం అలీకి తపూరియాను పరిచయం చేయించింది మరణించిన ముఖ్యమంత్రే. చాలా రోజులపాటు వైయస్ తరఫున హసన్ కోట్ల రూపాయలను హవాలా మార్గంలో మళ్లించాడు. వైయస్ ఆకస్మిక మరణం తర్వాత... ఇదే పని జగన్ తరఫున చేయడం ప్రారంభించాడు. హసన్ అలీని, తపూరియాలను దాదాపు 20 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ... ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరించింది. దీనికి సంబంధించిన రెండు సీడీలను త్వరలో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది. విదేశాల్లో తపూరియాకు చెందిన 11 ఖాతాలు, అలీకి చెందిన 8 ఖాతాల వివరాలు కూడా ఈడీ నివేదికలో ఉన్నాయి.
జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై ఈడీ ఇప్పటికే ఒక సమగ్ర నివేదిక తయారు చేసినట్లు తెలిసింది. అయితే, యువనేతపై ఏ చర్య తీసుకోవాలన్న విషయంపై తమకు పైనుంచి స్పష్టమైన ఆదేశాలు లేవని బహుశా ఉప ఎన్నికలయ్యేదాకా వేచి చూస్తున్నట్లుందని పేర్కొన్నాయి. జగన్ అక్రమాల చిట్టా తయారీ దాదాపు పూర్తయిందని, ఇక భారీ స్థాయిలో చర్యలు తీసుకోవడమే మిగిలిందని, మే 8వ తేదీ తర్వాత దీనికి శ్రీకారం చుట్టవచ్చని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారంట. ఇలా జరిగితే జగన్ ఇంటరాగేషన్ తప్పకపోవచ్చునని తెలుస్తోంది.