సత్య సాయిబాబా ఎపిసోడ్: ఆ ఇద్దరు మంత్రులు ఎవరు?
సత్య సాయిబాబా ఆస్పత్రిలో చేరిన తర్వాత మంత్రి జె. గీతా రెడ్డి ప్రశాంతి నిలయానికి వెళ్లారు. సత్య సాయిబాబా ఆరోగ్యంపై సమీక్ష చేశారు. సత్య సాయిబాబా ఆరోగ్యంపై ఆమె ఎడతెరిపి లేకుండా ప్రకటనలు చేస్తూ వచ్చారు. మంత్రి రఘువీరా రెడ్డి కూడా హడావిడి చేశారు. సత్య సాయిబాబా ట్రస్టుపై, సత్య సాయిబాబా వ్యవహారాలపై వస్తున్న వార్తాకథనాలకు వివరణ ఇవ్వడంలో ఆయన బిజీగా గడిపారు. ఆ తర్వాత ఈ ఇద్దరు మంత్రులు కూడా మాట్లాడడం మానేశారు. మంత్రుల పేర్లను మాత్రం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ వెల్లడించలేదు. గీతా రెడ్డి, రఘువీరా రెడ్డి సత్య సాయిబాబా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు.
సత్య సాయిబాబా స్థితిపై నోరు విప్పకుండా ఉండడానికి ఓ ఐపియస్ అధికారికి కూడా భారీగా డబ్బులు ముట్టినట్లు చానెల్ ఆరోపించింది. ఆ అధికారికి 200 కోట్ల రూపాయలు ముట్టాయని, వాటిని అతను హవాలా మార్గంలో విదేశాల్లో తన కుమారుడికి తరలించాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా చెప్పుకుంది. కాగా, బాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య సేవలకు స్పందిస్తున్నారని సత్యసాయి బాబా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా శుక్రవారం సాయంత్రం కూడా ప్రకటించారు.