మంత్రులు, చిరంజీవి కలిసి వైయస్ జగన్ను ఢీకొట్టగలరా?
సంవత్సరంన్నర పాటు కడప పార్లమెంటు సభ్యుడిగా ఉండి ప్రజలలోకి వెళ్లకున్నా అక్కడ వైయస్ ప్రభావం మరికొన్నాళ్లు పని చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, నాయకులు గెలుస్తామని చెబుతున్నప్పటికీ వారికి కూడా ఆ విషయం తెలుసని అభిప్రాయ పడుతున్నారు. గెలవడం కష్టమని తెలిసే పులివెందులలో పోటీని మొదట ఉపసంహరించుకుందానుకున్నప్పటికీ జగన్ బాబాయి వివేకానందరెడ్డి పులివెందుల నుండి పోటీకి సై అనే సరికి కడప నుండి డిఎల్ రవీంద్రారెడ్డిని ప్రకటించక తప్పలేదు. అయితే వైయస్ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని పులివెందుల ప్రజలు వివేకాపైన అయినా చూపించక పోరా అని కాంగ్రెసు ఆశతో ఉంది. వివేకా కూడా తనకు స్థానికంగా ఉన్న పరిచయాలు, అనుబంధాల దృష్ట్యా ఖచ్చితంగా గెలుస్తానని ధీమాతో ఉన్నారు.
కుటుంబ వారసత్వంగా వచ్చిన ప్రజా బలం కలిగిన జగన్ను అధికార పార్టీ ఎదుర్కోవడం కష్టమే. జగన్ను ఎదుర్కోవడానికి అధికార కాంగ్రెసు నియోజకవర్గానికో మంత్రితో కలిపి మొత్తంగా పన్నెండు మంది మంత్రులను రంగంలోకి దింపింది. అంతేకాకుండా ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందో చూసుకొని మరీ ఆ మంత్రిని ఆ నియోజకవర్గంలో నియమించింది. వైశ్య వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో మంత్రి టిజి వెంకటేష్ను నియమించింది. మాజీ ముఖ్యమంత్రి రోశయ్యతో కూడా ప్రచారం చేయించాలని చూస్తోందంటా.
అలాగే పులివెందులలో ఎక్కువగా ముస్లింలు ఉండటంతో అక్కడ మంత్రి అహ్మదుల్లాను నియమించింది. అది చాలదన్నట్లు ప్రజాధరణ కలిగిన చిరంజీవిని ఈనెలాఖరులో ప్రచారంలోకి దింపనుంది. పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్తో కలిసి కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ గులాం నబీ ఆజాద్ మే మొదటి వారంలో ప్రచారం చేయనున్నారు. ఇక పార్లమెంటు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి అయితే అహర్నిషలు కష్టపడుతున్నారు. అయితే వైయస్ కుటుంబం ఇన్నాళ్లు రిగ్గింగుకు పాల్పడిందని, అక్రమాలు చేసిందన్న ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలలోకి వెళితే సాంప్రదాయ ఓటు డిఎల్కు పడితే గెలిచే అవకాశాలు లేక పోలేదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జగన్కు భిన్నంగా డిఎల్ ఇప్పటికి ఆరుసార్లు గెలిచి ప్రజామోదం పొందిన వ్యక్తి అని జిల్లా పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.