పుట్టపర్తి సత్య సాయి మృతిపై మరో వివాదం, శవపేటిక ఆర్డర్పై దుమారం
ఏప్రిల్ 1వ తేదీన కోయంబత్తూర్ కంపెనీకి ఈ ఆర్డర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఐదవ తేదీన దాన్ని కర్ణాటక రాజధాని బెంగళూర్లోని మల్లేశ్వరంలో గల కుమార్ అండ్ కుమార్ ఇంటర్నేషనల్ కంపెనీ స్వీకరించి, శవపేటికను తయారు చేసిందని చెబుతున్నారు. దాన్ని ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాదు మీదుగా పుట్టపర్తి తరలించారని వార్తాకథనాల వెల్లడి. ప్రత్యేక ఎసి సదుపాయం గల శవపేటికను తయారు చేయించినట్లు చెబుతున్నారు. శవపేటిక నమూనాను మెయిల్ ద్వారా పంపినట్లు చెబుతున్నారు.
కాగా, మరో విధమైన కథనం కూడా ప్రచారంలో ఉంది. కన్నడ నటుడు రాజ్కుమార్ చనిపోయినప్పుడు తయారు చేసిన శవపేటిక దెబ్బ తిన్నదని, దాంతో దాన్ని పక్కన పడేశారని, దానికే మరమ్మతులు చేసిన పుట్టపర్తికి పంపించారని మీడియాలో ప్రచారమవుతోంది. దాని విలువ 57 వేల రూపాయలుగా చెబుతున్నారు. అందుకు సంబంధించిన రశీదు ప్రతిని టీవీ చానెళ్లలో చూపించారు. సత్య సాయిబాబా శవాన్ని ఉంచిన శవపేటికను టీవీల్లో చూసిన తర్వాత దీన్ని తామే తయారు చేశామని కుమార్స్ అండ్ కుమార్స్ కంపెనీ సిబ్బంది చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.