బాబా సమాధి కోసం పుణ్యక్షేత్రాల నుంచి జలాలు, మట్టి..!!
ఈ కుల్వంత్ హాలులోనే బాబా సాధారణంగా భక్తులకు దర్శనమిస్తుంటారు. ప్రస్తుతం బాబాను ఇదే హాలులో సమాధి చేయనున్నారు. సమాధి ప్రక్రియకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమైనాయి. బాబా సమాధి కోసం దేశ వ్యాప్తంగా పవిత్ర స్థలాలుగా భావించే 18 ప్రాంతాల నుండి మట్టిని అక్కడి భక్త సమాజాలు ఇప్పటికే పుట్టపర్తికి చేర్చాయి. గంగ, యమునతో పాటు 7 నదులు, తీర్థాల నుండి కూడా జలాన్ని పుట్టపర్తికి తీసుకువచ్చారు. సమాధి ప్రక్రియలో వీటిని వాడనున్నారు.
పరమ పవిత్ర స్థలమైన కాశీ నుండి అలాగే కర్నాటక రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖ వేద పండితులు, వివిధ మఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాయిబాబాకు అత్యంత ప్రీతి పాత్రమైన ఏనుగు సత్య కీర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంకా కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, బిజెపి పార్టీ సభ్యులు బండారు దత్తాత్రేయ, బిజెపి మాజీ అధ్యక్షుడు ఎల్.కే. అద్వానీలతో పాటు పలువురు ప్రముఖులు బాబాకు నివాళులు అర్పించారు. కాగా.. సత్య సాయి బాబాను సమాది చేసిన తర్వత మాత్రమే భక్తులను కుల్వంత్ హాలులోనికి అనుమతించనున్నారు.