భవానీ హత్యకు ప్రేమే కారణం, ప్రేమికుడే నదిలో తోసేశాడు
టీనేజ్ వయస్సు దాటిన వారు ప్రేమించుకొని తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే స్నేహితులు మద్దతు ఇచ్చి వారిని దూర ప్రాంతాలకు ఎలా అయితే పంపిస్తారో అచ్చు అలాగే భవాని వ్యవహారం నడిచిందంట. ఈ నెల 21న ఇంట్లో నుండి వెళ్లిపోయిన భవాని తాడెపల్లిగూడెంలో కృష్ణా నదిలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల వయసు కలిగి ఆరో తరగతి చదువుతున్న భవానీని తన సీనియర్ విద్యార్థి అయిన ప్రవీణ్ ప్రేమించాడని చెబుతున్నారు. ప్రవీణ వయస్సు 14 ఏళ్లు. ఇతను ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే ఇంట్లో చెప్పకుండా స్నేహితుల పుట్టిన రోజు అని చెప్పి ఇంట్లో నుండి బయట పడ్డారంట.
వారి ప్రేమను సఫలం చేయడానికి సహ విద్యార్థులే చందాలు పోగు చేసి వారికి డబ్బులు ఇచ్చారంట. వారికి మరో తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి కూడా సహాయం చేశాడంట. చందాలు పోగు చేసి వారిని, వారితో పాటు సహాయంగా శ్రీకాంత్ అనే మరో విద్యార్థిని పంపించారు. ఈ తతంగమంతా పాఠశాల ఆఖరి పని దినం రోజునే జరిగిందని తెలుస్తోంది. వారు మొదట తిరుపతి, అటునుండి విజయవాడ వెళ్లారంట. అయితే ఇటీవలె భవాని లేకుండా ఇంటికి వచ్చిన ప్రవీణ్, శ్రీకాంత్లు భవాని ట్రెయిన్ నుండి పడిపోయిందని చెప్పారంట. అయితే ఆమె మాత్రం నదిలో శవంగా కనిపించింది. ఇలా ఏమీ తెలియని వయస్సులో విద్యార్థుల మనస్సులను సినిమాలు, చుట్టూ ఉన్న సమాజం దారుణంగా చెడగొట్టుతోంది.