జగన్ ఎవ్వరి మాట వినడు, మరికొందరు నా బాటలోనే: కాటసాని
ఇటీవల పులివెందులలో చిరంజీవి ప్రచారం చేస్తున్న సమయంలో జగన్ వర్గం కోడిగుడ్లు విసరడం బాధ కలిగించిందన్నారు. ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే హక్కు ఉందని కానీ అలా గుడ్లు విసరడం అన్యాయమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు. ఒక లౌకిక వాదిగా బిజెపితో కలుస్తానని జగన్ చెప్పడం తనను కలిచి వేసిందన్నారు. జగన్ బిజెపితో కుమ్మక్కయ్యారన్నారు. మొదటి నుండి కాంగ్రెసులో ఉన్న తమకు ఆ వ్యాఖ్యలు నచ్చలేదన్నారు. తనకు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నోటీసులు పంపించారని తెలిసిందని, అయితే తనకు అవి అందలేదని చెప్పారు. తాను తాఖీదులకు భయపడి వెనక్కి తిరిగి రాలేదన్నారు. కేవలం జగన్ పోకడ నచ్చకనే వెనక్కి వచ్చానని చెప్పారు. జగన్ ఇప్పటి వరకు పార్టీ విధివిధానాలపై సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు.
జగన్కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఆరోపించారు. జగన్ ఒంటెత్తు పోకడలలో మార్పు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆయన తీరుపై ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు అందరికీ అసంతృప్తి ఉందన్నారు. పోసాని మురళీ కృష్ణను వెంట బెట్టుకొని చిరంజీవిపై విమర్శలు చేయించవలసిన అవసరం లేదన్నారు. పోసాని తదితరుల వెనుక ఎవరు ఉన్నారో ప్రజలందరికీ తెలుసున్నారు. తాను ఇన్నాళ్లూ జగన్తో ఉన్నప్పటికీ చిరంజీవిని ఎక్కడా విమర్శించలేదన్నారు. చిరంజీవిపై విశ్వాసంతోనే తాను తిరిగి వచ్చినట్లు చెప్పారు.