వైయస్ జగన్ విజయాన్ని కోరుతున్న తెలంగాణ నాయకులు
తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పట్టు సాధించింది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలంగాణలో పూర్తి బలహీనపడిందని భావిస్తున్నారు. తమ పార్టీ పట్టును నిలబెట్టుకోవడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కష్టపడుతున్నా అంత ఫలితం ఇవ్వడం లేదని చెబుతున్నారు. పైగా, కడపలో వైయస్ జగన్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తే తెలంగాణ నాయకులు చాలా మంది ఆయన వైపు మళ్లే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. దానివల్ల కాంగ్రెసు పార్టీ తెలంగాణలో మరింత బలహీనపడుతుందని, సీమాంధ్రలో వైయస్ జగన్ పట్టు పెరిగితే అక్కడా కష్టాలు ఎదురవుతాయని, ఈ పరిస్థితి కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ దిశగా ఆలోచన చేయడానికి పనికి వస్తుందని విశ్లేషిస్తున్నారు.
వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు ఇప్పుడు తెలంగాణలో స్వేచ్ఛగా పర్యటిస్తున్నారు. వైయస్ జగన్ ఫీజు రీయంబర్స్మెంట్ ఆందోళనకు కూడా తెలంగాణ నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురు కాలేదు. దీన్నిబట్టి వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తమకు మరింత లాభం జరుగుతుందని తెలంగాణ నాయకులు భావిస్తున్నారు.