నీ దమ్మేమిటో చూపించు, నా సంగతి సరే: జగన్కు చంద్రబాబు సవాల్
కడప ఉప ఎన్నికల్లో సానుభూతి ముందు అవినీతి పని చేయలేదని ఆయన అన్నారు. కడప ఉప ఎన్నికల్లో డబ్బుల పంపిణీ, సానుభూతి, రౌడీయిజం పని చేశాయని ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రజలకు విపరీతంగా డబ్బులు పంచారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసుల తీరు ప్రజాస్వామ్యం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితిని కల్పించిందని ఆయన మండిపడ్డారు. ఉప ఎన్నికల తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందని ఆయన అన్నారు.
రాజకీయాల్లో వంశపారంపర్యత పనికి రాదని ఆయన అన్నారు. నాయకుడిని ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీలో ప్రతి నాయకుడికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్పారు. పార్టీకి నష్టం కలిగించే పనులను దిగితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసుకు రాజకీయాలపై ధ్యాస తప్ప రైతు సమస్యలు పట్టడం లేదని ఆయన అన్నారు. తాను పర్యటనలు జరిపినప్పుడు ఏదో చేశామని అనిపించి ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. చట్టాలు సవరించి అయినా సరే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.