ఫలితాలు శిరోధార్యం: ఉప ఎన్నికలపై సిఎం కిరణ్ కుమార్ రెడ్డి
వైయస్ మరణించిన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఉపఎన్నికలివి అనే విషయాన్ని గుర్తించాలన్నారు. రాబోయే రోజుల్లో కడప జిల్లాలో కాంగ్రెస్ పునాదులు పటిష్టం అవుతాయని చెప్పారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజమన్నారు. ప్రతి అపజయం నుంచి పాఠాలు నేర్చుకుని మున్ముందు గట్టిగా పని చేయడానికి ఈ అనుభవం పునాదిలా దోహదపడుతుందని తాను నమ్ముతానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాబోయే రోజుల్లో కడపలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందని పునరుద్ఘాటించారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపొందడం సంతోషకరమని ఆయన వ్యాఖ్యానించారు.
వైయస్సార్ వారసత్వం కాంగ్రెసుదా, జగన్దా అని అడిగితే ఆయన సమాధానం దాటవేశారు. ప్రత్యేక పరిస్థితిలో ఎన్నికలు జరిగాయని అన్నారు. ఓటమికి ఎవరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో మీ పార్టీ నుంచి ఎవరైనా వేరే పార్టీకి మారే అవకాశముందంటారా అని అడిగితే తాను అలా భావించట్లేదని, ఎవరూ పార్టీని వీడరని, ఈ రోజు దుర్దినం (బాడ్ డే) రేపు మారొచ్చునని, ప్రత్యేక పరిస్థితికితోడు చాలా సానుభూతి ఉందని, రేపు ఎన్నిక పెట్టినా ఫలితం వేరే విధంగా రావొచ్చునని, ఒకే ఒక్క అంశాన్ని భవిష్యత్కు ప్రామాణికంగా తీసుకోలేమని అన్నారు. మీ ప్రభుత్వం వచ్చే మూడేళ్లు ఉంటుందంటారా అని ప్రశ్నిస్తే ప్రభుత్వం చాలా బలంగా ఉందని, 2014 ఎన్నికల నాటికి మరింత బలోపేతం అవుతామని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేస్తామని జవాబిచ్చారు.