సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉంది: వైయస్ జగన్
కడప ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెసు అఖండ విజయం రాష్ట్రంలో రాజకీయ మార్పులకు నాంది కానుందని జగన్ చెప్పారు. కడప ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెసు గెలుపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు సేవ చేయాలన్న జ్ఞానోదయం కలుగుతుందన్నారు. కడప ఓటర్లు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు గుణపాఠం చెప్పారని, కాంగ్రెసుతో జతకట్టిన తెలుగుదేశం పార్టీని తరిమికొట్టారని దుయ్యబట్టారు. తన తండ్రి వైయస్పై అభిమానంతో తనకు, తన తల్లికి పట్టం కట్టిన ఓటర్లందరికీ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెసును ఆదరించడం ద్వారా వైయస్ తమ గుండెల్లో కొలువై ఉన్నారని ప్రజలు నిరూపించారన్నారు.
వరి మద్దతు ధర కోసం గుంటూరులో 48 గంటలపాటు తాను చేపట్టే దీక్షతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయాలన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజైన జులై 8న కడపజిల్లా ఇడుపులపాయలో రెండు రోజులపాటు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు జగన్ వెల్లడించారు. ప్లీనరీలో విస్తృతంగా చర్చించి పార్టీ విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. ఉప ఎన్నికల్లో తమకు ఘనవిజయాన్ని అందజేసిన కడప ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్, విజయమ్మ.. హైదరాబాద్లోని వైయస్ఆర్ కాంగ్రెసు కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.