కిరణ్పై ఫిర్యాదుకు ఎమ్మెల్యేలు రెడీ, పార్టీ తీరుపైనా అసంతృప్తి
విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమే కాకుండా పలువురు శాసనసభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కడప, పులివెందుల ఉప ఎన్నికల విషయంలో ఆయన వ్యవహరించిన తీరును కూడా వారు తప్పు పడుతున్నారు. ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, కింది స్థాయిలో నాయకత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలేదని అంటున్నారు. పార్టీ తీరుపట్ల కూడా శాసనసభ్యులు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్కు, ముఖ్యమంత్రికి మధ్య పొసగడం లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఇద్దరి మధ్య సమన్వయం కొరవడిందని చెబుతున్నారు. డి శ్రీనివాస్ను ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకోవడం లేదని, అంతా ఒంటిచేతి మీద నడిపించాలని చూస్తున్నారని అంటున్నారు. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించవచ్చునని అంటున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇటీవల పరోక్షంగా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడి తీరును తప్పు పట్టారు.