డైలమాలో వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు, గ్యారంటీ ఇవ్వని జగన్?
వచ్చే ఎన్నికల్లో టికెట్లు తమకే ఇస్తామనే గ్యారంటీ లేకపోవడం శాసనసభ్యులను తికమక పెడుతున్న విషయం. ఈ విషయంపై వారు జగన్ను అడిగినట్లు తెలుస్తోంది. అయితే, సర్వే నిర్వహిస్తామని, సర్వే ఫలితాలను బట్టి టికెట్ల పంపకం ఉంటుందని ఆయన నింపాదిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో శాసనసభ్యులు చాలా మంది వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. పైగా, జగన్ శాసనసభా నియోజకవర్గాల్లో శానససభ్యులకు దీటుగా రెండో శ్రేణి నాయకత్వాలను జగన్ ప్రోత్సవిస్తున్నారు.
జగన్ వైఖరి స్పష్టంగా లేకపోవడం వల్ల గుంటూరు దీక్షకు ఎమ్మెల్యేల హాజరు సంఖ్య తగ్గినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి అందుకే జగన్కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కమలమ్మ వంటి శాసనసభ్యులు ఇప్పటికే వెనక్కి వచ్చారు. కాంగ్రెసు శాసనసభ్యులు చాలా మంది తమపై అనర్హత వేటు వేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రాయబారాలు నడుపుతున్నట్లు చెబుతున్నారు.