తెలంగాణపై రెండో ఎస్సార్సీకి రాజకీయ నాయకుల తీవ్ర వ్యతిరేకత
తెలంగాణకు, రెండవ ఎస్సార్సీకి ఎంటువంటి సంబంధంలేదని బిజెపి సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు రెండవ ఎస్సార్సీ అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందరూ ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఉందన్నారు. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి సవాల్ చేస్తున్నా ఎందు వెనకాడుతున్నారో టిడిపి వారు సమాధానం చెప్పాలన్నారు. అవిశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం అని వివరణ ఇచ్చారు. తెలంగాణను అడ్డుకోవడానికే చంద్రబాబు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడంలేదన్నారు.
రెండవ ఎస్సార్సీలో తెలంగాణ అంశం చేరుస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గోనె ప్రకాశరావు చెప్పారు. కేవలం ఉత్తర ప్రదేశ్ కోసమే ఎస్సార్సీ వేయరని ఆయన అన్నారు. రెండవ ఎస్సార్సీ వేయాలని గతంలోనే ఏఐసిసి అప్పటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఇప్పుడు కూడా రెండవ ఎస్సార్సీని వేసి అందులో తెలంగాణ అంశాన్ని చేరుస్తారని ఆయన వివరించారు. కాంగ్రెస్ నేతలు అందరూ రాజీనామా చేస్తే తెలంగాణ అదే వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో ఇంకా కాలయాపనచేయడం భావ్యంకాదన్నారు.