జగన్ వర్గం డైలమా: ఖాళీ బ్యాలెట్టా, ఆత్మప్రబోధానుసారం ఓటా?
ఎమ్మెల్యేల భేటీలో పాల్గొన్న జగన్ కూడా ఖాళీ బ్యాలెట్ వాదనకు మద్దతిచ్చినట్లు సమాచారం. ఈ వ్యూహంలో సాంకేతికతలపై పలువురికి అనుమానాలు ఉండటంతో శనివారం ఉదయం 8 గంటలకు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలంటే తెలుగుదేశం అభ్యర్థికి ఓటేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆ ఆలోచన వద్దని అనుకున్నట్లు తెలిసింది. సభాపతి ఎన్నిక సజావుగా పూర్తయితే తమ శిబిరంలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఇది తమ బలాన్ని తగ్గిస్తుందని జగన్ వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికిప్పుడు అవిశ్వాస తీర్మానం అంశాన్ని తెరపైకి తేవడంపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. శనివారం శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం లేదని, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక, వారి గురించి మాట్లాడడంతోనే సమయం గడుస్తుందని, తెలుగుదేశం అవిశ్వాసం కోసం పట్టుపట్టినా ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చర్చకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపించడం లేదని నాయకులు అభిప్రాయపడినట్లు తెలిసింది. అందుకే, తాముకూడా అవిశ్వాస తీర్మానం కోసం పట్టుబట్టాలని నిర్ణయించారు. అవిశ్వాస తీర్మానం పెడితే బలాన్ని చూపిద్దామని జగన్ చెప్పినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి శనివారం జరిగే పరిణామాల ఆధారంగా అప్పటికప్పుడు వ్యూహాన్ని రచించాలని, ముఖ్య నేతలంతా శనివారం సమావేశం కావాలని నిర్ణయించారు.