వైయస్ జగన్ ఎమ్మెల్యేల ప్రతివ్యూహం, వేటుకు ముందే రాజీనామాలు
వైయస్ జగన్ వెంట నడుస్తున్న ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి, తెలుగుదేశం శానససభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలపై కూడా వేటు పడే అవకాశాలున్నాయని అంటున్నారు. వీరిపై వేటు వేసే విషయంలో జాప్యం చేయకూడదనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే చర్యలుంటాయని భావిస్తున్నారు. ఈ సందర్భంలో తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి.
తమపై వేటు వేయడానికి ముందే రాజీనామాలు చేయాలనే ఉద్దేశంతో వారున్నట్లు చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్ జెరూసలేం నుంచి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 12వ తేదీన జగన్ హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. మర్నాడు 13వ తేదీన రైతు సమస్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కలెక్టరేట్ల ముందు ధర్నా చేయనుంది. వైయస్ జగన్ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొంటారు. వైయస్ జగన్తో చర్చించిన తర్వాతనే తాము రాజీనామాలు చేసే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అయితే, షోకాజ్లు అందుకున్న శాసనసభ్యులు మాత్రమే రాజీనామా చేస్తారా, వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులంతా రాజీనామా చేస్తారా అనేది తెలియడం లేదు.