హ్యాకింగ్ భయంతో వణికిపోతున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్స్
అభిప్రాయాలు పంచుకొన్న వారిలో దాదాపు సగం మంది తాము రోజుకు 5 గంటల పాటు ఇంటర్నెట్కు వెచ్చిస్తున్నట్లు జవాబిచ్చారు. ఇతరులతో ఆన్లైన్ సంప్రదింపులు జరపడం పలువురికి నచ్చిన వ్యాపకంగా ఉంది. ఇతర కీలక కార్యకలాపాలలో పరిశోధన (35 శాతం), వినోదం (22 శాతం) ఉన్నాయి. సైబర్ దాడులకు బాధితులం అయినట్లు దాదాపు నాలుగింట ఒక వంతు (23 శాతానికి పైగా) తెలియజేశారు. ఇందులో 67 శాతం మంది వ్యక్తిగత సమాచారం పోగొట్టుకొన్నామని చింతించారు. ఇ-మెయిల్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని 19 శాతం యూజర్లు ఆక్రోశించారు.
దాదాపు 90 శాతం భారతీయులు వారి పర్సనల్ కంప్యూటర్లలో యాంటీ-వైరస్ సొల్యూషన్ నెలకొల్పుకొన్నట్లు పేర్కొన్నారు. అయితే 62 శాతం మంది వారి పీసీలో యాంటీ-వైరస్ను నెలకొల్పాక అంతటితో తమ పని ముగిసినట్లు భావించారు. దీనర్థం భారతీయ వినియోగదారులకు సైబర్ దాడుల విపరిణామాలను గురించిన పూర్తి స్పృహ ఇంకా రాలేదనే భావించాలని అధ్యయనం తెలిపింది. ఆన్లైన్ భద్రతకు ప్రమాదం సృష్టించే సైబర్ దాడులు అంతకంతకు పెచ్చు పెరుగుతున్నట్లు అధ్యయనం ప్రస్తావించింది.