బొత్స సత్యనారాయణకు తొలి షాక్, తీవ్ర వ్యాఖ్యలతో హర్షకుమార్ లేఖ
బొత్స రాజకీయ జీవింతమంతా వివాదాస్పదమేనని, తప్పుడు దారుల్లో భారీగా డబ్బు గడించారు. శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు మద్యం సిండికేట్తో కుమ్మక్కయ్యారుని, కృష్ణా-గోదావరి బేసిన్లో ఇసుక మాఫియాతో చేతులు కలిపారని, సీబీఐ నిష్కళంకుడని చెప్పినా వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో బొత్స చేయి ఉందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. బొత్స, ఆయన కుటుంబ సభ్యులకు జిల్లాలో భూకబ్జాకోరులుగా పేరుందని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నా నియోజకవర్గంలో కాపులు మొత్తం అటువైపు వెళ్లిపోయినా దళితులు కాంగ్రెస్కు పూర్తి అండగా నిలిచారని, ఫలితంగా ముక్కోణపు పోటీలో పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు.
కోస్తా జిల్లాల్లో సాధారణంగా కాపులు-దళితులకు మధ్య సత్సంబంధాలు లేవని, బొత్స మొదటి నుంచీ దళిత వ్యతిరేకి అని,బొత్స సత్యనారాయణ కేవీపీ మద్దతుదారుడు కూడా అని, కాపు, తూర్పుకాపు, మున్నూరు కాపులంతా ఒక్కటేనని, పీసీసీ అధ్యక్షస్థానం ఎప్పుడూ వీరికే ఇస్తూ పోతే కాంగ్రెస్కు సంప్రదాయ ఓటుబ్యాంక్ అయిన దళితులు జగన్వైపు వెళ్లే ప్రమాదముందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంత వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే మంచిదని ఆయన అన్నారు.