2జి స్కామ్లో అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ ఎండి సునీతా రెడ్డి?
కంపెనీలో సునీతా రెడ్డి వాటాపై సిబిఐ ఆరా తీస్తోంది. ఇందుకు గాను సిబిఐ ఆమెకు సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెడ్డి సబ్సిడరీలో మలేషియా కంపెనీ మాక్సిస్ వంద శాతం ప్రిఫరెన్స్ షేర్ల సబ్స్క్రీప్షన్పై సిబిఐ వివరణ కోరుతోంది. మాక్సిస్ 74 శాతానికి 7800 కోట్లు చెల్లించగా, సునీతా రెడ్డి, ఆమె భర్త 34 కోట్లకే 26 శాతం వాటా ఎలా పొందారనే విషయంపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఎయిర్సెల్ను విక్రయించాలని తనపై కేంద్ర మంత్రి దయానిధి మారన్ ఒత్తిడి తెచ్చారని శివశంకరన్ చెప్పిన తర్వాత ఎయిర్సెల్ డీల్ను సిబిఐ పరిశీలిస్తోంది.
టెలికం రంగంలో అపోలోకు గానీ ప్రతాప్ సి రెడ్డికి గానీ పెట్టుబడులు లేవని, పి. ద్వారకానాథ్ రెడ్డి, సునీతా రెడ్డి ప్రమోట్ చేసిన సింద్యా సెక్యురిటీస్కు ఎయిర్సెల్లో వాటాలు ఉన్నాయని అపోలో ఆస్పత్రుల గ్రూప్ ఓ అధికారిక ప్రకటనలో చెప్పింది. ద్వారకానాథ్ రెడ్డి సునీతా రెడ్డి భర్త. కేంద్ర మంత్రి దయానిధి మారన్కు సునీతా రెడ్డి సన్నిహితురాలని, ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఆ వాటాను పొందారని ఆరోపణలు వస్తున్నాయి. సునీతా రెడ్డిని సిబిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయి.