సమైక్యవాదులకు 245 సీట్లు, ప్రత్యేక వాదులు చిత్తు: లగడపాటి
శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వాదులు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే పులిచింతల, పోలవరం వద్దంటున్నారని రాష్ట్రం విడిపోయాక ఇంకా అల్లకల్లోలం సృష్టిస్తారని హెచ్చరించారు. తెలంగాణ నేతలు తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికే తెలంగాణ యువకులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇస్తే నక్సలిజం, మతతత్వవాదులు పెరుగుతారని శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలో హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టమని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి మళ్లీ వారు ఎందుకు పోటీకి దిగుతున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల కన్వీనర్గా ఉండిన కాంగ్రెసు ఎంపీ ఒకరు తనను హెచ్చరించడం ఎంత వరకు సమంజసం అన్నారు.
తెలంగాణలో సమైక్యవాదులపై దాడులు చేస్తుండగా, సమైక్యాంధ్రలో మహాత్మాగాంధీ బాటలో శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని చెప్పారు. టి-కాంగ్రెసు నేతలు తాము రాజీనామాలకు పూనుకోకుండా సీమాంధ్రులను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోవద్దని అధిక సంఖ్య ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలో లేదని సంకీర్ణ ప్రభుత్వం ఉందన్నారు. మమతా బెనర్జీతో సహా పలువురు ప్రత్యేక రాష్ట్రానికి ఒప్పుకోరన్నారు. ఏ పార్టీ నేతలు అయినా తమ తమ ప్రాంత ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఉద్యమించవచ్చని అన్నారు.