కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలిని ఆమె భర్తనే చంపాడా?
ఈ నెల 17న కిరణ్రెడ్డి తన సోదరుడు సునీల్రెడ్డి వివాహ నిశ్చితార్థం సందర్భంగా బ్యాచిలర్ పార్టీకి భర్త చైతన్యరెడ్డితో కలిసి వెళ్లారు. అక్కడి నుంచి అర్ధరాత్రి దాటాకా ఇంటికి చేరుకున్నారు. క్షేమంగా చేరుకున్నట్లు తన సోదరుడికి కిరణ్రెడ్డి ఫోను చేసి చెప్పారు. శనివారం (18న) ఉదయం చైతన్యరెడ్డి రఘోత్తంరెడ్డికి ఫోను చేసి కిరణ్రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అక్కడ కిరణ్ని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మృతురాలి తల వెనక గాయం, ముఖంపై దిండుతో అదిమి వూపిరి ఆడనివ్వకుండా చంపినట్లు అనుమానంగా ఉందంటూ రఘోత్తంరెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశారు. చైతన్యరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నామని, శవపరీక్ష నివేదిక వస్తేనే నిజానిజాలు వెల్లడయ్యే అవకాశం ఉందని జూబ్లీహిల్స్ పోలీసు అధికారులంటున్నారు.