బాబా సోదరుడి తనయుడు రత్నాకర్, శ్రీనివాసన్ల చుట్టు బిగుస్తున్న ఉచ్చు
ముఖ్యంగా ప్రశాంతినిలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రధాన్ను పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఆయన కోసం పోలీసులు ఇంటివద్దకు వెళ్లగా కనీసం తలుపులు కూడా తీయకుండా దాదాపు గంటసేపు జాప్యం చేసినట్లు సమాచారం. ఇంతకాలం ప్రశాంతి నిలయంలోకి ట్రస్ట్ సభ్యుల అనుమతి లేకుండా అడుగు కూడా పెట్టలేని పోలీసులు ఇప్పుడు చొచ్చుకెళ్తున్నారు. ప్రశాంతి నిలయంలోకి అడుగు పెట్టాలంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనుమతి ఉండాలి. ఆయన ట్రస్ట్ సభ్యుల సూచన మేరకు నడుచుకునేవారు. అయితే ప్రస్తుతం ఆయననే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతోపాటు వారికి వత్తాసు పలుకుతున్న స్థానిక డీఎస్పీని కూడా విధుల నుంచి తప్పించి శిక్షణకు పంపడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో ట్రస్ట్ సభ్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మొత్తమ్మీద ఉచ్చు బిగుసుకుంటోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమ అదుపులో ఉన్న ప్రశాంతి నిలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను పోలీసులు విచారిస్తున్నారు.
యజుర్మందిరం నుంచి ఎంతెంత డబ్బు ఎప్పుడు తరలిపోయిందనే విషయాన్ని కూపీ లాగుతున్నారు. ప్రధాన్ను బయటికి తీసుకురావడానికి ట్రస్ట్లోని కొందరు సభ్యులు కేంద్రమంత్రుల స్థాయిలో పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. పోలీసులకు పట్టుబడ్డ డబ్బులతో తమకు సంబంధం లేదని రత్నాకర్ చెప్పి ఆ దిశగా నిరూపించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు అంతా తాము చెప్పినట్లే జరుగుతుందని ఊహించిన ట్ర స్ట్ సభ్యులకు ఒకవైపు బంధువర్గాలు, మరోవైపు పోలీసులు ఝులక్ ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనేక అవకతవకలు వెలుగు చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యజుర్మందిరం నుంచి అక్రమంగా తరలుతున్న సత్యసాయి సంపద వ్యవహారంలో ట్రస్ట్ సభ్యులు ఆర్జే.రత్నాకర్, శ్రీనివాసన్లకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
ఈకేసులో వారిని కూడా విచారిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. శనివారం రాత్రి పుట్టపర్తి నుంచి బెంగుళూరుకు రూ.35లక్షల నగదును తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నగదు మొత్తం ట్రస్ట్కు సంబంధించినదేనని ఎస్పీ షహనవాజ్ ఖాసీం కూడా వెల్లడించారు. ఈ వ్యవహారంపై ప్రశాంతినిలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రధాన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో ట్రస్ట్కు సంబంధించిన ముఖ్యుల పేర్లు వెలుగు చూసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టు చేసిన సుహాన్శెట్టి శిష్యుడు సదాశివ, శ్రీనివాసన్ పర్సనల్ సెక్రటరీ వెంకటేష్లను కూడా విచారించడానికి పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు ఉన్నతాధికారులనుంచి పోలీసులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.