సత్య సాయి ట్రస్టుపై చర్యలకు మాజీ కేంద్ర మంత్రి బ్రేకులు వేశారా?
ఆ నాయకుడి జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేస్తోందని, ఆర్థిక లావాదేవీల వివరాలు అందించాలంటూ ట్రస్టుకు గురువారమే 'నోటీసులు' ఇవ్వాలనుకున్నప్పటికీ ఆ ప్రక్రియను శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలిసిందని ఆ పత్రిక రాసింది. ట్రస్టులో ఒక్క రత్నాకర్ మినహా మిగిలిన వారంతా ఆయా రంగాలలో తల పండిన ప్రముఖులే కావడంతో ట్రస్టు నుంచి వివరణ కోరడంపై ప్రభుత్వం అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తోందని అంటున్నారు. ట్రస్టు నుంచి కోరాల్సిన సమాచారానికి సంబంధించి నిర్దిష్టంగా కొన్ని అంశాలను గుర్తించిందని, ట్రస్టు స్థిర చరాస్తులు, అప్పులు, ఆదాయం, ఎక్కడెక్కడి నుంచి విరాళాలు వచ్చాయని, బ్యాంకు ఖాతాల వివరాలు అడగాలని నిర్ణయించిందని, ఈ కసరత్తును దేవాదాయ శాఖ పూర్తి చేసిందని ఆ పత్రిక వార్తాకథనంలోని ఓ అంశం.
ఆ పత్రిక వార్తాకథనం ప్రకారం - ఒక 'ముసాయిదా నోటీసు'ను సిద్ధం చేసింది. దీనిని హడావుడిగా జారీ చేయకుండా న్యాయపరమైన అంశాలను కూడా పరిశీలించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ ఫైలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ వద్ద ఉంది. దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ట్రస్టుకు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.