సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వివాదం: సీనియర్ సభ్యుడు భగవతి అసంతృప్తి
ప్రశాంతి నిలయం యజర్ మందిరం నుంచి బెంగళూర్కు సంపద తరలించిన సంఘటనలో వి. శ్రీనివాసన్, రత్నాకర్ పాత్రపై సీనియర్ సభ్యులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందనే విషయంపై సమాచారం రాబట్టడానికి వారు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. ట్రస్టు సభ్యులకు పోలీసులు సమన్లు జారీ చేయడం ప్రశాంతి నిలయం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ వ్యవహారం ట్రస్టుకు చెడ్డ పేరు తెస్తుందని భగవతి, గిరి లాంటి వారు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
అతి స్వల్పమైన 35 లక్షల రూపాయల తరలింపు వ్యవహారం సత్య సాయి బాబా అందించిన నిస్వార్థ సేవకు మచ్చ తెచ్చేదిగా ఉందని ఓ సభ్యుడు ఎత్తి చూపినట్లు సమాచారం. సొమ్ము స్వాధీనం కేసును ఆదాయం పన్ను శాఖ చూడాల్సి ఉండగా, పోలీసులు తమ పరిధిని అతిక్రమించి వ్యవహరించారని ఓ సభ్యుడు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ట్రస్టు కార్యకలాపాలపై, ఆర్థిక వ్యవహారాలపై మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.