సాయి ట్రస్టులో అక్రమాలు లేవు: శ్రీనివాసన్
బాబా సమాధిని ట్రస్టు చేపట్టడం లేదని అన్నారు. సమాధి నిర్మాణం కోసం ఓ భక్తుడు 35 లక్షల రూపాయలు రత్నాకర్కు అప్పగించారని అన్నారు. ఆ డబ్బులు బెంగుళూరు శంకరనారాయణ కన్సల్టెన్సీకి పంపించామని ఆ సమయంలో పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. శంకరనారాయణ కంపెనీ మొదట రుసుం తీసుకోకుండా పని ప్రారంభించిందని చెప్పారు. బాబా సమాధిని ట్రస్టు డబ్బులతో కాకుండా విరాళాలతో నిర్మించాలని ముందుగానే నిర్ణయించుకున్నామని చెప్పారు. ట్రస్టు సభ్యులం భక్తుల విరాళాలను ఎప్పుడూ డబ్బుల రూపంలో తీసుకోమని చెప్పారు. వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని ప్రతి పైసకు రశీదు ఉందని చెప్పారు. కాని సమాధి కోసం ఆ 35 లక్షల రూపాయలను మాత్రం నగదు రూపంలో ఇచ్చారని చెప్పారు. యజుర్ మందిరం లెక్కలు సజావుగానే సాగాయన్నారు.
నగలు, ఆభరణాలు, డబ్బుల లెక్కలు ప్రముఖుల సమక్షంలో జరిగిందని చెప్పారు. ట్రస్టుసు సంబంధించిన ఆదాయ పన్నులో ఎలాంటి జాప్యం లేదన్నారు. ట్రస్టుకు సంబంధించిన 9.75 కోట్ల ఆదాయ పన్ను కూడా చెల్లించామని చెప్పారు. యజుర్వేద మందిరంలో డబ్బులు ఉన్నట్లు తమకు తెలియదన్నారు. బాబా శివైక్యం చెందిన తర్వాతే తాము యజుర్మందిరంలోకి వెళ్లామని అప్పుడే డబ్బులు ఉన్నట్లు తెలిసిందన్నారు. బాబా మృతి తర్వాత సేవా కార్యక్రమాలు ఆగిపోతాయనే ఆందోళన అవసరం లేదన్నారు. బాబా ముందు చూపుతో అవసరమైన నిధులను ఏర్పాటు చేశారని అన్నారు. బాబా ప్రారంభించిన అన్ని సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. సత్యసాయి ట్రస్టు 1972లో రిజిస్టర్ అయిందన్నారు. యజుర్మందిరంలో విదేశీ కరెన్సీ లేదన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు స్పందిస్తామని ట్రస్టు నుండి సమాధానం చెబుతామని చెప్పారు. ట్రస్టు కార్యకలాపాలు ప్రభుత్వం నిర్వహించవలసిన ఆవశ్యకత లేదన్నారు. ఆరోపణలు వచ్చాయి కాబట్టే మీడియా సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. టిటిడి దేవాలయం, సాయి ట్రస్టు సేవా సంస్థ కాబట్టి విలీనం చేయాల్సిన అవసరం లేదన్నారు. ట్రస్టు సభ్యులుగా బాబా తమని నియమించారని చెప్పారు. ఆరోపణలు వచ్చాయని రాజీనామా చేసి వెళితే బాబాకు ద్రోహం చేసినట్టే అని అన్నారు. ఇది మాకు పరీక్షా సమయం అని ఎదుర్కొని నిలబడతామని చెప్పారు. బాబా తమని నమ్మకంతో నియమించారని చెప్పారు. ప్రతి నిర్ణయాన్ని ట్రస్టు సభ్యులమంతా కలిసి ఏకగ్రీవంగా తీసుకుంటున్నామని చెప్పారు.