ఆర్టీసి చార్జీల పెంపు, వంటగ్యాస్ తగ్గింపు
పల్లె వెలుగు బస్సుల చార్జీలను పన్ను నుంచి మినహాయించే అవకాశాలున్నట్లు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. వంటగ్యాస్ ధరను తగ్గించాలని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారని, దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 161 కోట్ల రూపాయల మేర వంటగ్యాస్ ధరను తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలో కాంగ్రెసు పార్టీ జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఆర్టీసి చార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. డీజిల్ ధరలు గతంలో పెంచడం వల్ల ఆర్టీసి నష్టాలు 520 కోట్ల రూపాయలకు చేరుకుందని, ప్రస్తుత పెంపుతో 600 కోట్ల రూపాయల మేరకు నష్టాలు పెరిగాయని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాలు కూడా పంపించినట్లు ఆయన తెలిపారు.