తెలంగాణ రాజీనామాలు అంతర్గత వ్యవహారం: సింఘ్వీ
తెలంగాణ ప్రజాప్రతినిధుల ప్రకటనపై హైదరాబాదు పర్యటనలో ఉన్న కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా ప్రతిస్పందించారు. తెలంగాణ సమస్య కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన అన్నారు. ఓ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడికి చెందిన విద్యాసంస్థలో దళిత క్రిస్టియన్ల సమస్యలపై ఏర్పాటైన సదస్సులో ఆయన శుక్రవారం సాయంత్రం ప్రసంగించారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెసుకు మెజారిటీ లేదని, చాలా సార్లు స్వల్ప మెజారిటీతో నడిచిందని, దాంతో కీలకమైన అంశాలపై పార్లమెంటులో నిర్ణయం తీసుకోలేపోతోందని, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లను కల్పించే విషయంపై న్యాయశాఖతో మాట్లాడుతానని ఆయన చెప్పారు.
తెలంగాణకు రాజీనామాలు పరిష్కారం కాదని గులాం నబీ ఆజాద్ అన్నారు. పార్టీ నాయకులు ఈ విషయంలో తొందరపడవద్దని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమస్య కాదని, దేశ సమస్య అని అన్నారు. ఇతర రాష్ట్రాలతో తెలంగాణ అంశం ముడిపడి ఉందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య నిమిషంలో తేల్చేది కాదని, తన ఒక్కడి వల్ల కూడా కాదని, కేంద్ర ఈ విషయాన్ని పరిశీలిస్తోందని ఆయన అన్నారు. కీలకాంశాలపై ఏకాభిప్రాయం అవసరమని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నాయకుల అభిప్రాయం అవసరమని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల నాయకులతోనూ మాట్లాడాల్సి ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ అంశం జఠిలమైందని హైదరాబాదులో ఉన్న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆహ్వానించారు. తెలంగాణ ప్రజలు ఈ త్యాగాలే కోరుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.