ప్రధాని ఇష్టం: చిరుకు కేంద్ర మంత్రి పదవిపై ఆజాద్
చిరంజీవి తేనీటి విందుకు పిలిస్తే వచ్చానని, చిరంజీవి ఇప్పుడు కాంగ్రెసు అగ్రనేతల్లో ఒకరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అంశంపై తొందర వద్దని ఆయన పార్టీ తెలంగాణ నాయకులకు సూచించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి ముందు మరిన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంటుందని, పెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను రాజకీయంగా, ఆర్థికంగా సమర్థవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ సమస్యను పరిష్కారించడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల మనోభావాలను కూడా గౌరవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని ఆయన అన్నారు. చిరంజీవితో జరిగిన సమావేశంలో ఆజాద్తో పాటు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి ఇంటికి ఆజాద్ నేరుగా వెళ్లారని తెలుసుకున్న బొత్స ఆ తర్వాత తాను వెళ్లి సమావేశంలో కలిశారు.