సత్య సాయి మందిరంలో తవ్వుతున్న కొద్దీ సంపద
అధికారుల ప్రమేయం లేకుండా కేవలం ట్రస్టు సభ్యులే సంపదను లెక్కించడంతో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మందిరంలోని మిగతా గదుల్లో సంపదను అధికారుల సమక్షంలో లెక్కించారు. ప్రభుత్వ ఆదేశాలు, ట్రస్టు సభ్యుల విజ్ఞప్తి మేరకు యజుర్వేద మందిరంలో 10 గదుల్లోని సంపదను లెక్కించినట్లు జెసి అనితా రామచంద్రన్ చెప్పారు. ఇందులో వెండి నగలు 116 కిలోలు, బంగారం 905 గ్రాములు, వజ్రాల ఉంగరం ఉన్నట్లు తెలిపారు. వెండి విలువ రూ.57,96,607, బంగారం విలువ రూ.15,83,525, వజ్రాల ఉంగరం విలువ రూ.3,09,360 ఉందన్నారు. ముంబయి నిపుణులతో ఆభరణాల విలువ కట్టించామన్నారు. ఈ సంపదను సోమవారం స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో జమ చేస్తామని తెలిపారు. వీటితో పాటు బాబా పట్టు వస్త్రాలు, పెన్నులు ఉన్నాయని, వీటి విలువను తర్వలో లెక్కిస్తామని చెప్పారు. యజుర్వేద మందిరం తాళాలు బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ వద్దే ఉన్నాయి. శనివారం ఆయనే తలుపులు తెరిచారు. మందిరంలో ఉన్న 11 గదులనూ పరిశీలించినట్లు జేసీ తెలిపారు. యజుర్వేద మందిరం పక్కనే ఉన్న భవనంలోని సంపదను గురుపౌర్ణమి తర్వాత లెక్కిస్తామన్నారు.
గురు పౌర్ణమి రోజు సత్యసాయి మహాసమాధిని ప్రారంభించనున్నట్లు కౌన్సిల్ సభ్యుడు నాగానంద తెలిపారు. సర్వమతాల భక్తులు ఆరాధించేలా సమాధి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో పనులు పూర్తవుతాయని, బాబా పుట్టిన రోజు వేడుకల నాటికి సమాధిపై విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.