రాజకీయం మానుకో: కెసిఆర్పై నామా ధ్వజం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే తమకు ముఖ్యమన్నారు. కాంగ్రెసు పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. జాతీయస్థాయిలో హైదరాబాదును రెండు, మూడు స్థానాల్లో టిడిపి నిలబెడితే కాంగ్రెసు దానిని ఏడు ఎనిమిదో స్థానంలోకి తీసుకు పోయిందన్నారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జైపాల్ తన కుర్చీ కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆ కుర్చీ తెలంగాణ ప్రజలు ఇస్తేనే వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాజీనామా చేయని మిగిలిన ప్రజాప్రతినిధులు సైతం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెసు పార్టీయే కారణం అన్నారు. తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు. కాంగ్రెసు ద్వందనీతి ప్రదర్శిస్తుందని విమర్శించారు. టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడం సంతోషకరమన్నారు. స్పీకర్ మీరాకుమార్ను స్వయంగా కలుసుకొని పార్లమెంటు హాలులో రాజీనామాలు సమర్పించినట్లు చెప్పారు. టిడిపి తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు.
1969 నుండి కాంగ్రెసు మాయమాటలు చెబుతూ అధికారంలోకి వస్తూ తెలంగాణను మాత్రం ఇవ్వడం లేదని రాజీనామా చేసిన మరో టిడిపి ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు. 2004లో ఎన్నికల సమయంలో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని ప్రకటించిందని, ఆ తర్వాత 2009 డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణ ప్రాసెస్ ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వంలో సంక్షోభం సృష్టించడానికే రాజీనామాలతో ముందుకు వచ్చినట్లు చెప్పారు.