రెండో రోజూ కొనసాగుతున్న తెలంగాణ బంద్
సింగరేణిలో ఉద్యోగులు రెండో రోజూ విధులు బహిష్కరించారు. తెలంగాణ బంద్ వల్ల సింగరేణికి రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 45వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండో రోజు 22 వేలమంది ఉద్యోగులు బంద్కు మద్దతు తెలిపారు. దీని కారణంగా మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసి బస్సులు నిలిచిపోయాయి.
తెలంగాణ బంద్ కారణంగా కాకతీయ యూనివర్శిటీ పరిధిలో నేటి నుంచి జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేశారు. దూరవిద్య, డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు కేయూ అధికార వర్గాలు ప్రకటించాయి. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ మళ్లీ ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో రెండు రోజుల బంద్ దృష్ట్యా బుధవారం జరగాల్సిన బీడీఎస్ చివరి సంవత్సరం (పీడోడాంటిక్స్) పరీక్షను వాయిదా వేసినట్లు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యవిజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తెలిపారు. వాయిదా వేసిన పరీక్ష ఈ నెల 20వ తేదీన తిరిగి నిర్వహిస్తామన్నారు.
పౌర సరఫరా గ్రేడ్-1, 2 ఉద్యోగాల ఇంటర్వ్యూలు బుధవారం యధాతథంగా జరుగుతాయని ఐపీఈ అధికారులు తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందించామని, అనివార్య కారణాల వల్ల హాజరుకాని వారికి మరో రోజు నిర్వహిస్తామని చెప్పారు.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 7వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా 27వ తేదీ నుంచి జరుగుతాయని విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి.